జంట హత్యల లైవ్ సి.సి కెమెరా ఫుటేజ్ ను విడుదల చేసిన పోలీసు అధికారులు..!

జంట హత్యల లైవ్ సి.సి కెమెరా ఫుటేజ్ ను విడుదల చేసిన పోలీసు అధికారులు..!

జనం న్యూస్: గుంటూరులో ఇద్దరు వాచ్ మేన్ల హత్య కలకలం రేపింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద యమహా షోరూం వాచ్ మేన్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేయగా.. అరండల్ పేట 10/2లో ఉన్న ప్రభుత్వ వాకిన్ లిక్కర్ స్టోర్ వాచ్ మేన్ బత్తుల సాంబశివరావును గుర్తు తెలియని దుండగుడు హత్య చేశాడు. యమహా షోరూంలో బైక్ ని దొంగతనం చేసేందుకు దొంగలు వచ్చి ఉండవచ్చునని, వాచ్ మేన్ అడ్డుకోవడంతో హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అలానే లిక్కర్ స్టోర్ వద్ద వాచ్ మేన్ ని హత్య చేసి దుండగులు చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ జంట హత్య కేసులకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులు ఈ హత్యలకు పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ముఖానికి మాస్క్ తొడుక్కుని ఈ హత్యకు పాల్పడ్డారు. మొదట అమరావతి రోడ్ లోని యమహా షోరూం సెక్యూరిటీ గార్డుని, ఆ తర్వాత అరండల్ పేట లిక్కర్ స్టోర్ వాచ్ మేన్ ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే మరో రెండు షాపుల్లో చోరీకి పాల్పడుతుండగా తమకు సమాచారం అందిందని.. ఘటనా స్థలానికి వెళ్లి పారిపోతున్న దొంగలను వెంబడించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో దొంగలు అర్ధరాత్రి సెక్యూరిటీ గార్డులను హత్య చేశారు. ముఖానికి మాస్క్ పెట్టుకున్న దుండగుడు చేతిలో ఒక రాడ్డుతో వచ్చి కుర్చీలో దుప్పటి కప్పుకుని కూర్చున్న వాచ్ మేన్ పై దాడి చేశాడు. అయితే ఈ దాడిలో వాచ్ మేన్ మృతి చెందాడు. మరొక ఘటనలో హెల్మెట్ పెట్టుకుని ఒక దుండగుడు వాచ్ మేన్ పై దాడి చేశాడు. ఈ ఘటనలో కూడా ఆ వాచ్ మేన్ మృతి చెందాడు. చచ్చేవరకూ రాడ్డుతో కొట్టిన విజువల్స్ ని పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగులను పట్టుకున్నారు.