నడి రోడ్డుపై పేలిపోయిన రిక్షా.. ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం. (వీడియో చూడండి)

జనం న్యూస్: గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా సామాగ్రితో వెళ్తున్న ఈ-రిక్షాలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. జరిగిన ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. అప్పటికే ఆ ప్రాంతంలో జగన్నాథుని శోభాయాత్ర అంగరంగవైభవంగా కొనసాగుతోంది. యాత్రకు సంబంధించిన సామాగ్రితో ముందు వెళ్తున్న ఈ-రిక్షా ఒకటి ఓ దుకాణం ముందు ఆగింది. అక్కడ ఆగిన కాసేపటికే ఆ రిక్షా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనం షాకయ్యారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ-రిక్షాకు మంటలు అంటుకుని పటాకులు పేలుస్తున్న దృశ్యం రోడ్డుపై ఉన్న ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కానీ, కాసేపటికి అందరూ షాక్‌ నుంచి తేరుకున్నారు. ఈ-రిక్షాలో ఉన్న టపాసులకు నిప్పంటుకుని పేలిపోయాయని గ్రహించారు. వెంటనే నీళ్ల బకెట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లతో మంటలను ఆర్పేశారు. అయితే ఈ పేలుడులో ఈ-రిక్షా డ్రైవర్‌, టపాసులు కాలుస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫైర్‌ క్రాకర్స్‌ కాల్చే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గ్రేటర్‌ నోయిడాలోని దాద్రి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగన్నాథుని శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం కోసం నిర్వాహకులు భారీగా పటాసులు తెప్పించారని, ఆ పటాసులను ఓ ఈ-రిక్షాలో పెట్టుకుని ఒక్కో ప్యాకెట్‌ తీసి కాలుస్తూ ముందుకు వెళ్తున్నారని, ఈ క్రమంలో కాల్చిన పటాసులకు సంబంధించిన నిప్పురవ్వలు ఈ-రిక్షాలోని క్రాకర్స్‌ కాటన్‌లపై పడటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.