జనం న్యూస్ : సాధారణంగా మనం జూలో సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది చూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కొందరిని ఆ చూపే భయంతో వణికేలా చేస్తుంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూ నుంచి పారిపోయింది ఓ ఆడ సింహం. రెండున్నర గంటలపాటు అధికారులను హడలెత్తించింది. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలోని జూలో ఉద్యోగిని గాయపరిచి ఎన్క్లోజర్ నుంచి సింహం తప్పించుకుంది. జంతువు తన ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చిందని ఇతర ఉద్యోగులను హెచ్చరించి ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశాడు ఉద్యోగి. దీంతో సహాయక సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అలర్టయిన అధికారులు జూ నుంచి సందర్శకులను ఖాళీచేయించారు. తప్పించుకున్న సింహం కోసం గాలించగా రెండున్నర గంటల తర్వాత ఓ పొదల్లో కనిపించింది. దీంతో మత్తు మందు ఇచ్చి దానిని బోనులోకి తరలించారు. అసిస్టెంట్ యానిమల్ కీపర్ మాట్లాడుతూ గదులను శుభ్రం చేస్తుండగా, తలుపులు సరిగా మూయకపోవడంతో ఎన్క్లోజర్ నుంచి తప్పించుకుందని ఒక ప్రకటనలో తెలిపారు. సింహమే జనవాసాల్లోకి వస్తే .. ఇంకేముంది రచ్చరచ్చే. అచ్చం అలాంటి ఘటనే ఇటీవల పాకిస్తాన్లో జరిగింది. లాహోర్లోని ఓ జూలో బోనులో ఉన్న సింహానికి ఆహారం వేస్తుండగా.. అది సిబ్బంది కళ్లుగప్పి బయటకు వచ్చేసింది. ఏకంగా గోడ దూకి రోడ్డుపైకి వచ్చి ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. సింహాన్ని బంధించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోవడంతో చివరకు దానిని తపాకీతో కాల్చి చంపారు. సింహం గోడ దూకి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

