జనం న్యూస్ : దట్టమైన పొగమంచు అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఈ ఫాగ్‌ వల్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జరిగిన ప్రమాదంలో బస్సులు వరుసగా ఒకదాని వెంట మరోటి ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం వరుసగా బస్సులన్నీ తగలబడ్డాయి. రోడ్డుపై పలు బస్సులు, కార్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటం వల్ల బస్సులు మంటల్లో కాలిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికులు, వాహనదారులు మంటలను అదుపు చేశారు. సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బస్సుల మంటలకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు ఆ వ్యక్తి వీడియోలో తెలిపాడు. భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఓ వైపు దట్టమైన పొగలు.. మరోవైపు బస్సుల్లో ప్రమాదానికి గురైన ప్రయాణికుల ఆర్తనాదాలతో.. ఆ ప్రదేశం భయానకంగా మారింది. అక్కడి దట్టమైన మంచు కారణంగా 7 బస్సులు,3 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే డిఎం,ఎస్పీతో సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.