జనం న్యూస్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కపడ జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ఆ సంస్ధకు చట్టవిరుద్దంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లిజుల అంశాలపై వివరణ కోరింది. ఈ విషయమై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని భారతి సిమెంట్స్‌ ప్రధాన కార్యాలయానికి నోటీసులను పోస్ట్ ద్వారా పంపించింది. అంతేకాదు అదానీ నియంత్రణలో ఉన్న అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్(ACC)కు, రామ్‌కో సిమెంట్స్‌కు కూడా గనుల శాఖ నోటీసులు పంపించింది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ మూడు కంపెనీలకు వేర్వేరు సున్నపురాయి నిల్వలు ఉన్న భూములను కేంద్ర గనులు, ఖనిజాలు (అభివృద్ధి-నియంత్రణ) చట్టం- 1957 నిబంధనలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వేలంలో కాకుండా లీజులు కేటాయిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మైనింగ్ లీజులు ఎంఎండీఆర్‌ యాక్ట్‌‌ను ఉల్లంఘించింది. అంతేకాకుండా 2023 సెప్టెంబర్‌ నెలలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించింది.మరోవైపు న్యాయసలహాల పేరిట హైడ్రామా నడిపి లీజులను నిర్ధారిస్తూ.. కాలపరిమితిని 50 ఏళ్లుగా ప్రకటించారు. ఈ మూడు సంస్థల లీజులపై 2024లో కేంద్రానికి ఫిర్యాదులు చేయగా.. వివరణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఏడాది అయిపోయింది. వాస్తవానికి భారతి సిమెంట్స్ అసలు పేరు రాఘురాం సిమెంట్స్. కాగా గత ప్రభుత్వ హయాంలో దాన్ని వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. అప్పటి రాఘురాం కంపెనీకే సున్నపురాయి లీజులు ఉన్నాయి.  అయితే వాటిని వైఎస్ జగన్ సతీమణి పేరుతో భారతీ సిమెంట్స్‌గా మారిన తర్వాత కూడా ఆ లీజులలే వాడుకున్నారు. అప్పటికే కేంద్రం గనుల విషయంలో స్పష్టమైన పాలసీ తీసుకొచ్చింది. ఓ కంపెనీ పేరుతో ఉన్న లీజులు మరోకరు ఆ కంపెనీనీ టేకోవర్ చేసుకుంటే ఆ లీజులు చెల్లవని స్పష్టం చేసింది. దరఖాస్తులు చేసుకున్నా కూడా అవి ల్యాప్స్ అవుతాయని క్లారిటీ ఇచ్చింది. ఇక దీంతో భారతీ సిమెంట్స్‌ లీజులు విషయంలో గందరగోళంగా మారాయి. మరోవైపు 2017లో ఏపీ ప్రభుత్వం రాఘురాం సిమెంట్స్‌కు ఇచ్చిన ప్రాథమిక అనుమతిని రద్దు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చని తర్వాత లీజులను మళ్లీ తన కంపెనీ పేరుతో పునరుద్ధించుకునేందుకు ఏకంగా అత్యున్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తిని, అలాగే అడ్వకేట్ జనరల్‌ను వాడుకున్నారు. నిబంధనలను అనుసరించాలిని హైకోర్టు ఆదేశించినప్పటికీ న్యాయసలహా  పేరుతో లీజులను పునరుద్ధరించుకున్నారు. 2024 ఎన్నికల ముందు లీజులని పునరుద్ధరిస్తూ.. జీవోలు జారీ చేశారు. అప్పట్లోనే ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు కూడా వెళ్లింది. ఈ మేరకు విచారణ జరపాలని రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.