శబరిమల గోల్డ్ స్కామ్‌లో మరో షాక్‌!రెండో నిందితుడు సిట్‌ చెరలో – హైకోర్టు తాజా ఆదేశాలు

జాతీయ వార్తలు

జనంన్యూస్ : శబరిమల ఆలయంలో బంగారం మాయం కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో రెండో నిందితుడు మురారి బాబును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో పనిచేస్తున్న సమయంలో.. బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను ఆయన అధికారిక రికార్డుల్లో రాగి పలకలుగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పారదర్శక టెండర్లు లేకుండా మరమ్మతులకు అప్పగించారని తేల్చారు. ఇక శబరిమల గోల్డ్ స్కామ్‌పై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు.. దీనిపై సరైన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.కేరళతోపాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శబరిమల ఆలయ గర్భగుడి పక్కన ఉన్న ద్వారపాలకులు, ఆలయ ద్వారాలపై ఏర్పాటు చేసిన బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. ఇటీవల వాటి బరువు తగ్గిపోయిన విషయం బయటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్).. తాజాగా ఈ కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసింది.ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) మాజీ పరిపాలనాధికారి మురారి బాబును బుధవారం రాత్రి పెరున్నాలలోని ఆయన నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారు పూతతో ఉన్న ఆలయ ద్వారపాలక పలకలను.. మురారి బాబు గతంలో తప్పుగా రాగి పలకలు అని రికార్డుల్లో పేర్కొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ బంగారం మాయం వివాదం అప్పటి నుంచే మొదలైందని విచారణలో తేల్చారు. బంగారు పలకలను రాగి పలకలు అని చెప్పి.. ఎలాంటి టెండర్లు లేకుండానే.. వాటిని మరమ్మతుల కోసం పంపించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.2019లో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్టు పరిపాలనాధికారిగా పనిచేసిన మురారి బాబు.. తాను ఆ పదవిలో ఉన్నప్పుడే ఈ బంగారం మాయం వివాదం మొదలైంది. ఆలయానికి చెందిన బంగారు పూతతో ఉన్న ద్వారపాలక పలకలను.. అధికారిక రికార్డుల్లో రాగి పలకలు అని మురారి బాబు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తులను చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు ఉన్నికృష్ణన్ పొట్టి ద్వారా మరమ్మతుల కోసం పంపించారు. అయితే ఈ బంగారం కుంభకోణం విషయం వెలుగులోకి వచ్చినప్పుడు.. ద్వారపాలక పలకల తయారీలో రాగి ప్రధాన లోహం కాబట్టి అలా నమోదు చేసినట్లు అప్పట్లో మురారి బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై గతంలోనే టీడీపీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి మురారి బాబును సస్పెండ్ చేసింది.మరోవైపు.. ఈ శబరిమల గోల్డ్ స్కామ్‌ కేసును పరిశీలించిన కేరళ హైకోర్టు.. మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024లోనే ద్వారపాలక పలకల బంగారం పూతకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది. 2025లో పారదర్శక టెండర్ ప్రక్రియను పాటించకుండానే.. అధికారులు మళ్లీ ఉన్నికృష్ణన్ పొట్టికే ఆ విగ్రహాలను, పలకలను అప్పగించడంపై హైకోర్టు తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది.అయితే 2019లో అప్పగించిన ద్వారపాలక విగ్రహాలే.. 2025లో తిరిగి వచ్చాయా అనే విషయంపైనా కేరళ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఆ విగ్రహాలను తిరిగి అమర్చేటప్పుడు వాటి బరువును నమోదు చేయడంలో టీడీపీ అధికారులు విఫలం అయ్యారని.. ఈ బాధ్యత అందరిపైనా ఉందని కోర్టు పేర్కొంది. 2019లో జరిగిన దోపిడీని కప్పిపుచ్చడానికి 2025లో తిరిగి విగ్రహాలను అప్పగించడం అనేది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా ధర్మాసనం అనుమానించింది.ఇక ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరమ్మతుల కోసం 2019లో వాటిని ఉన్నికృష్ణన్ తీసుకెళ్లే సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా ఉండగా.. ఆ తర్వాత తిరిగి తీసుకువచ్చిన తర్వాత అవి కేవలం 38.28 కిలోలుగా ఉండటం వివాదాస్పదంగా మారింది. ఇక తనపై వచ్చిన ఆరోపణలను మురారి బాబు తీవ్రంగా ఖండించారు. బంగారు తాపడాలకు సంబంధించి తాను మరమ్మతులపై ప్రాథమిక నివేదికను మాత్రమే ఇచ్చానని వెల్లడించారు.వాటికి ఫైనల్ అనుమతులు మాత్రం ఉన్నతాధికారులే ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు.. మురారి బాబును మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి.. సిట్ అధికారులు విచారణ కోసం కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ అక్టోబర్ 30వ తేదీ వరకూ సిట్ కస్టడీలోనే ఉండనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *