
జనం న్యూస్ : చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.
Kurnool Bus Accident: కర్నూలు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విచారణలో కీలకమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో జరిగిన ఈ అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందలాది మొబైల్ ఫోన్ల పేలుడు వల్లే మంటలు వేగంగా వ్యాపించి ప్రాణనష్టం పెరిగిందని వారు ప్రాథమికంగా గుర్తించారు. ప్రారంభ దర్యాప్తు ప్రకారం, బస్సు ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి, పెట్రోల్ కారడం ప్రారంభమైంది. బస్సు ఆ బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో రోడ్డుపై నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ సమయంలో పెట్రోల్ మంటలు పట్టి వేగంగా వ్యాపించాయి. మొదట లగేజీ క్యాబిన్ మంటల్లో చిక్కుకుంది. అక్కడే 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉంచబడి ఉండటంతో వాటి బ్యాటరీలు వేడి తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ పేలుళ్ల వల్లే మంటలు బస్సు పై భాగంలో ఉన్న ప్రయాణికుల విభాగానికి చేరాయి. ఫోరెన్సిక్ బృందం తెలిపిన వివరాల ప్రకారం, లగేజీ క్యాబిన్కు పైభాగంలో ఉన్న సీట్లలో, బెర్త్లలో కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా దగ్ధమై ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఆ వేగంతో వ్యాపించడం వల్ల వారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది.


 
	 
						 
						