తాజా నిర్ణయం: పత్తి విక్రయం కోసం రైతులు ఈ యాప్ వాడాలి – అధికారుల హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ : భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తి కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. అయితే సీసీఐకి పత్తి అమ్మాలనుకునే రైతులు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని మెలిక పెట్టింది. అందులో నిర్దేశించిన తేదీన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపింది. ఈ స్లాట్ బుకింగ్ విధానంపై చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పత్తి కొనుగోళ్లకు భారత పత్తి సంస్థ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సిద్ధమవుతోంది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లోని 29 మార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీసీఐ నిర్ణయించింది. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 7, ఎన్టీఆర్‌ జిల్లాలో 6 చొప్పున కొనుగోలు కేంద్రాలు తెరుస్తోంది సీసీఐ. ఇప్పుడు రైతులు పత్తిని సీసీఐకి అమ్ముకోవాలంటే.. ముందుగా టైం స్లాట్‌ నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోలాగే ఈ విధానం ఉంటుంది. అయితే ఈ విధానం వల్ల రైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్లాట్ బుకింగ్‌.. పత్తి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ సమయం వేచి చూడకుండా.. వెంటనే అమ్ముకొని తిరిగి వెళ్లేలా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పత్తి రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు.. ‘కపాస్‌ కిసాన్‌’ అనే యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పంట తమ చేతికి వచ్చిన తర్వాత.. అమ్మకానికి సిద్ధమైన సమయంలో.. ఈ యాప్‌ ద్వారా టైం స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అనంతరం దాన్ని ఎంటర్ చేస్తే.. స్లాట్‌ బుక్ అవుతుంది. ఆ స్లాట్‌లో నిర్దేశించిన తేదీన పత్తిని.. సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే సరిపోతుంది.

అయోమయానికి గురవుతున్న రైతులు..! స్లాట్ బుకింగ్‌పై చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అయోమయానికి గురవుతున్నారు. దీనిపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలంటే సెల్‌ఫోన్ కచ్చితంగా ఉండాలి. అయితే చదువు లేని వృద్ధ రైతులు ఈ యాప్‌ను ఆపరేట్ చేయడం, వివరాలు నమోదు చేయడం మరింత కష్టమవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాప్‌ ద్వారా అన్ని వివరాలు నమోదు చేసి, స్లాట్ బుక్ చేసుకోవడానికి చాలా మంది రైతులు ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

ఈసారి మద్దతు ధర రూ. 8,110..

మరోవైపు, కేంద్రం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర.. క్వింటాలుకు రూ. 8,110 గా ప్రకటించింది. సీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పత్తిలో తేమ శాతం, నాణ్యత ఉంటేనే గరిష్ఠ ధర వచ్చే అవకాశం ఉంది. కాగా, కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర.. గిట్టుబాటు ధరగానే రైతులు భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఈసారి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *