ఎవరైతే మాకేంటి మేం ఇంతే..

ఎవరైతే మాకేంటి మేం ఇంతే..

 *విజయవాడ జనం న్యూస్ ప్రతినిధి.. *

 కేసుల నమోదులో జాప్యం..

 తీరు మార్చుకోని భవానీపురం పోలీసులు...

న్యాయవాదులంటే కనీస గౌరవం లేదు..

బాధితులు ఎవరైనా కావచ్చు పోలీస్ స్టేషన్ కి వెళ్లి న్యాయం చేయమని ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు తమకు అందినట్లుగా పోలీసులు ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్ మెంట్ అంటే రశీదు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 లోని సెక్షన్ 44 ప్రకారం పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులను జనరల్ డైరీలో నమోదు చేయాలి. ఫిర్యాదులో వ్రాయబడిన నేరం కాగ్నిజబుల్ నేరం అయితే సెక్షన్ 154 సీఆర్పీసీ ప్రకారం వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిర్యాదు దారులకు ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా అందించాలి. అది పోలీసుల ప్రధమ బాధ్యత. అయితే భవానీపురం పోలీసులు అందుకు భిన్నం. వారి రూటే సపరేటు.. ప్రజా పోలీస్ అనేది మాటలకే పరిమితం. సామాన్యుల పరిస్థితి ఏమో గానీ న్యాయవాదులకూ కనీస గౌరవం ఇవ్వరు, న్యాయవాదులు అంటే లెక్కలేని తనం, ఎవరైతే మాకేంటి మేం ఇంతే..అన్నట్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు మా మీద ఎటువంటి చర్యలు తీసుకోరు అనే ధీమా..

 *వివరాల్లోకి వెళితే :* విజయవాడ, భవానీపురం, బ్యాంక్ సెంటర్ ప్రాంతానికి చెందిన రాజులపాటి వెంకటేశ్వరరావు వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన భార్య అదే ప్రాంతంలో విజయ డైరీ పాల దుకాణం నిర్వహిస్తున్నారు. తమ దుకాణంలో పాలు, పెరుగు ప్యాకెట్లు దొంగిలిస్తున్నాడని మున్నా అనే వ్యక్తిని న్యాయవాది నిలదీశారు. కాగా, ఆదివారం ఉదయం సదరు మున్నా న్యాయవాది ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆయన భార్యను అసభ్యకరంగా దూషించాడు, న్యాయవాది మీద దాడి చేసి గాయపరిచాడు. వెంటనే న్యాయవాది భవానీపురం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. కనీసం ఫిర్యాదు అందినట్లు రశీదు కూడా ఇవ్వలేదు. మధ్యాహ్నం రండి, సాయంత్రం రండి అని పలు మార్లు స్టేషన్ చుట్టూ తిప్పారు. 

బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు జరిగిన విషయం స్టేషన్ అధికారి కృష్ణ దృష్టికి నేరుగా తీసుకువెళ్లి మూడు రోజులు అవుతుంది, అయినా కేసు నమోదు చేయలేదు. చట్ట ప్రకారం నాకు న్యాయం చేయండి మహాప్రభో అని వేడుకున్నా ఎటువంటి స్పందనా లేదు. ఒక న్యాయవాదికే న్యాయం చేయకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి ? భవానీపురం పోలీసులకు న్యాయవాదులు అంటే లెక్కలేని తనమా, కనీస గౌరవం లేదా మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ బాధిత న్యాయవాది వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో న్యాయవాదుల విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు భవానీపురం పోలీసుల మీద ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ఘటనలో న్యాయవాదులు స్టేషన్ అధికారిని నేరుగా సంప్రదించినా మున్నా మీద కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో.. నగర సీపీ క్రాంతి రాణా విచారణ జరిపి, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..