ఆంధ్రాలో ఘోరం.. వ్యాపారిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన మరికొందరు వ్యాపారులు. (వీడియో చూడండి)

జనం న్యూస్: విజయనగరం జిల్లాలో ఓ వ్యాపారిని మరికొందరు వ్యాపారులు కిడ్నాప్ చేసి నరకం చూపించారు. కర్రలతో దారుణంగా కొడుతూ.. బూటు కాలితో ఇష్టమొచ్చినట్టు తన్నారు. అంతటితో ఆగకుండా అతని చేత మూత్రం తాగించారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. వ్యాపారి భగవాన్ రామ్ రెండేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి విజయనగరానికి వచ్చి హోమ్ నీడ్స్ ఐటమ్స్ బిజినెస్ చేస్తున్నాడు. భగవాన్ రాంకు రాజస్థాన్ కి చెందిన వ్యాపారి బిజిలారాంతో పరిచయం ఉంది. బిజీలా రాం బెంగుళూరులో బిజినెస్ చేస్తున్నాడు. జూన్ 13వ తేదీన బిజిలా రాం, భగవాన్ రాం కు ఫోన్ చేసి, తాను బిజినెస్ పని మీద వైజాగ్ వస్తున్నానని, అక్కడ నుండి విజయనగరానికి వచ్చి కలుస్తానని చెప్పాడు. ఈ నెల 14 న బిజిలారాం తన స్నేహితుడు దిలీప్ తో కలిసి విజయనగరంలో భగవాన్ రాంను మీట్ అయ్యారు. దాబాకు తీసుకెళ్లి లిక్కర్ తాగించారు. ప్రీ ప్లాన్డ్‌గా అప్పటికే మరో ముగ్గురు అక్కడ కాపు కాచారు. అందరూ కలిసి భగవాన్ రాంను బలవంతంగా కారులో ఎక్కించారు. కర్రలతో చికక్కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ.. విచక్షణ రహితంగా దాడి చేశారు.భగవాన్ రామ్ తో బలవంతంగా మూత్రం తాగించారు. ఇదంతా మొబైల్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియోను రాజస్థాన్, బెంగళూరులోని వారి ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చివరకు భగవాన్ రాం స్నేహితులు రూ. 35వేలకు రాజీ కుదర్చడంతో అతన్ని వదిలేసి వెళ్లిపోయారు కిడ్నాపర్లు. బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు..విజయవాడలోని వాజీరాం అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం వెతుకుతున్నారు.