డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 18 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్
డిజిటల్ అరెస్టు పేరుతో సైబరు మోసగాళ్ళు వీడియో కాల్స్ చేసి, మోసాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 17నపిలుపు నిచ్చారు. ఈ తరహా కాల్స్, లింక్స్ మరియు వీడియో కాల్స్ తో సైబరు మోసగాళ్ళు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారిని భయపెట్టి, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సైబరు మోసగాళ్ళు ప్రజల మొబైల్స్ కు ఫోను చేసి తాము ఫెడెక్స్ లేదా బ్లూ డాట్ కొరియర్స్ నుండి మాట్లాడుతున్నామని, చిరునామా, ఆధార్ నంబరు, ఫోను నంబరు వంటి కొంత సమాచారాన్ని ముందుగా మనకు తెలిపి, మనం బుక్ చేసిన కొరియర్ పార్సిల్లో నిషేదిత మాదక ద్రవ్యాలు, ఫేక్ పాస్ పోర్టు, బంగారం బిస్కెట్లు ఉన్నాయని, మనీ ల్యాండరింగుకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు, మాదక ద్రవ్యాలనుథైవాన్, ఇరాన్, చైనా వంటి దేశాలకు పంపుతున్నారని నిర్ధారణ అయ్యిందని, కేసు కూడా నమోదయ్యిందని, విచారణ నిమిత్తం తాము సూచించిన సుదూర ప్రాంతానికి దర్యాప్తు నిమిత్తం రావాల్సి ఉంటుందన్న సమాచారంను అందిస్తారన్నారు. అంతేకాకుండా, సదరు మోసగాళ్ళు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ లేదా టాస్క్ ఫోర్స్ లేదా పోలీసు అధికారులతో మాట్లాడాలని తెలిపి, వేరే వ్యక్తులకు ఫోను కనెక్ట్ చేస్తారన్నారు. తదుపరి సైబరు మోసగాళ్ళు తమను ఒక పోలీసు అధికారిగా లేదా సిబిఐ అధికారిగా లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థకు చెందిన వ్యక్తిగా తనను పరిచయం చేసుకొంటూ, తన గుర్తింపు కార్డుగా నకిలీ ఐడి కార్డును పంపి, బుక్ చేసిన పార్సిల్ లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, బంగారం, నకిలీ పాస్ పోర్టువంటి వస్తువులున్నాయని, కేసు కూడా నమోదయ్యిందని, దర్యాప్తు నిమిత్తం తమ వద్దకు రావాల్సి ఉంటుందని భయపెడతారన్నారు. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబితే, ఆన్లైనులో కూడా దర్యాప్తుకు హాజరుకావచ్చునని, తమకు ఒక లింకు పంపుతున్నామని, వాటిపై క్లిక్ చేసి, స్కైప్ లో దర్యాప్తకు హాజరుకావాలని సూచిస్తారన్నారు. సైబరు మోసగాళ్ళ పంపిన లింకును క్లిక్ చేస్తే, తమ బ్యాంకు సేవింగు ఖాతాల్లోని నగదు చోరీకి గురవుతుందన్నారు. మరి కొన్నిసార్లు తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా గోప్యంగా వుంచాలని చెప్పి, తమపై నమోదైన కేసులో సహాయం చేస్తామని, చర్యలు నిలిపేస్తామని నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, ఖాతాలో డబ్బును కాజేస్తారన్నారు. ఫోన్లో వాట్సాప్, స్కైప్ వంటి యాప్ల ద్వారా వీడియోకాల్స్ చేసి సిబిఐ, కస్టమ్స్ మరియు పోలీసు అధికారిగా నమ్మించి, నకిలీ పత్రాలతో బెదిరించి, జైలు పేరు చెప్పి ప్రజల్ని భయపెట్టి అందినంత సొమ్మును తమ ఖాతాలకు జమ చేసుకుంటారని తెలిపారు.అదే విధంగా బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ పేరుతో తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించి, పెట్టుబడి పెట్టిన నగదుకు అధికంగా పెరిగినట్లుగా ఆన్లైనులో చూపుతారన్నారు. పెరిగిన సొమ్మును తీసుకోవాలని భావించే వారికి మార్జిన్ రూపంలో తిరిగి డబ్బులు కట్టాలని, లేకుంటే డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పి, ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి, సైబరు నేరస్థులు మోసాలకు పాల్పడతారన్నారు. కావున, ప్రజలందరూ ఇటువంటి సైబరు మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫెడెక్స్, బ్లూడాట్ వంటి కొరియర్ సర్వీసులు, డిజిటల్ అరెస్టు, బిట్ కాయిన్ పేరుతో వచ్చే నకిలీ కాల్సును, వీడియో కాల్స్ నమ్మి, సైబరు మోసాలకు గురికావద్దన్నారు. ఈ తరహా సైబరు మోనగాళ్ల కాల్స్ కు భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ కు ప్రజలెవ్వరూ స్పందించ వద్దని, ఆయా నంబర్లు నుండి వచ్చే కాల్స్ ను బ్లాక్ చేసి, సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు అందించాలన్నారు. సైబరు మోసగాళ్ళు వీడియో కాల్ విచారణ అంటే భయపడవద్దని, విచారణ చేస్తున్నామని చెప్పేవ్యక్తుల వివరాలు, సమాచారాన్ని నిర్భయంగా అడిగి తెలుసుకోవాలని, విచారణ నిమిత్తం అవసరమైతే పోలీసు స్టేషనులోనే కలుద్దామని తెలపాలన్నారు. మీ బ్యాంకు ఖాతా, పాస్పోర్టు, ఆధార్ కార్డు, మొబైల్స్క వచ్చే ఒ.టి.పి.లను ఎవ్వరికీ చెప్పవద్దన్నారు. ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైం పోర్టల్లో https://cybercrime.gov.in/ కు రిపోర్టు చేయాలని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.