బ్రతికుండగానే ఇవేం పిచ్చి వేషాలు అన్నా... నువ్వు నీ వింత చేష్టలు.. విచిత్ర మొక్కులు..

జనం న్యూస్: మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటాము. అలానే చాలా మంది కోరికలు కోరుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈ మొక్కులు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అన్నదానం చేయడం, దేవుడి గుడి నడిచి రావడం, మెట్లపై దీపాలు వెలిగించడం వంటి రూపాల్లో దేవుళ్లకు, దేవతలకు భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు. కానీ ఓ భక్తుడు అమ్మవారికి చెల్లించిన మొక్కు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతంలోని ఓ భక్తుడు శవంగా నటించి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందిన జయమణి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన సేలంలో ఉన్న మరియమ్మ అనే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాడు. తరచూ అమ్మవారి గుడి వెళ్లి పూజలు చేసేవాడు. అలానే ఒకసారి తాను అనుకున్నవి జరిగితే బతికుండగానే ఆఖరి కార్యం చేసుకుంటానని, అలానే గుడికి వస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడంట. అలానే అతడి కోరికలను అమ్మవారు నెరవేర్చిందంట. దీంతో తాను మొక్కును తీర్చుకునేందుకు జయమణి సిద్ధమయ్యాడు.తాను శవంలాగా మారి ఫ్రీజ్ పై కూడా పడుకున్నాడు. అలానే ఆయన చుట్టు ఆడవారు కూర్చుని రోదించారు. అలానే తన ఆఖరి కార్యానికి రావాలంటూ బంధువులందరిని ఆహ్వానించాడు. నిజమైన శవానికి ఎలాంటి ముస్తాబులు చేస్తారో.. అచ్చం అలాగే చేయించుకున్నాడు. పూలదండలు,డబ్బులు మొదలైనవి వేయించుకుని అతడు చావు సంబరం మాములుగా చేసుకోలేదు. అలానే అంతిమ యాత్ర బండిని పూలతో పుష్పక విమానంలో అలంకరించుకున్నాడు. చూసేవాళ్లందరూ చూసిన తరువాత చావుయాత్రకు బయలుదేరాడు ఈ వింత భక్తుడు. అలా ఊరంతా ఊరేగించి చివరకు స్మశానానికి తీసుకెళ్లారు. బంధువులు జనాలు కూడా నిజంగా చనిపోయిన వ్యక్తి వచ్చినట్లు తండోప తండాలు వచ్చి.. స్మశానం వరకు సాగనంపారు. అక్కడి నుంచి నేరుగా అమ్మవారి గుడి వెళ్లి.. తన మొక్కును చెల్లించాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేమి మొక్కురా సామీ.. అంటూ ఈ వీడియో చూసిన వాళ్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు.