ఘోరం.. నిధి కోసం బాలింత సజీవ దహనం.. ఆ తరువాత...

ఘోరం.. నిధి కోసం బాలింత సజీవ దహనం.. ఆ తరువాత...

జనం న్యూస్: సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. రోజు రోజుకు మనుషులు స్వార్ధపరులుగా మారుతూ కావాల్సింది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. అవసరం అయితే మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే బరితెగించిన కొందరు దుర్మార్గులు గుప్త నిధుల కోసం ఏకంగా ఓ బాలింతను దహనం చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘోరమైన చర్య స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? అది కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లా గబ్బూరు గ్రామం. ఇక్కడే నేత్రావతి (26) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం తెల్లవారు జామున నేత్రావతి తన ఇంటి ముందే మంటల్లో పూర్తిగా కాలిపోయి చనిపోయి కనిపించింది. ఇక ఉదయాన్నే గ్రామస్తులు అంతా ఈ సీన్ చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వారికి ఏం చేయాలో అర్థంకాక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేత్రావతి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఆమెను ఎవరైనా హత్య చేసి కాల్చి వేశారా? లేక బతికుండగానే కాల్చి చంపారా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉగాది అమవాస్య రోజు కావడంతో కొందరు దుండగులు కావాలనే ఆ మహిళను బాలింతను అని చూడకుండా గుప్త నిధుల కోసం ఇలా చేసి ఉండవచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.