వాహ్... శభాష్ సోదరా భారతదేశ పౌరుడు అంటే నీలాగనే ఉండాలి..!

జనం న్యూస్: వివిధ పథకాలకు సంబంధించిన నిధులు విడదల చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన అధికారులకు దిమ్మదిరిగేలా చేసాడో సర్పంచ్‌. లంచం కోసం అధికారులు వేధిస్తుండడంతో అందుకు నిరసనగా కరెన్సీ నోట్ల కట్టను మెడలో వేసుకొని వచ్చి అధికారుల ముందు నోట్లను గాల్లోకి విసురుతూ నిరసన తెలిపాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి 4 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా ప్రారంభించాలని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి జ్యోతి కవడదేవిని గ్రామ సర్పంచ్ మంగేష్ సాబ్లే కోరారు. పనులు ప్రారంభించాలంటే ఒక్కో బావికి 48 వేలు లంచం ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రైతులు పేదలని, లంచం ఇచ్చుకోలేరని ఆయన ప్రాధేయపడినా ఆమె వినిపించుకోలేదు. డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు. దాంతో ఆ సర్పంచ్‌ రెండు లక్షల రూపాయల కరెన్సీ నోట్లను దండగా గుచ్చి మెడలో వేసుకొని వచ్చి అందరూ చూస్తుండగానే దండనుంచి నోట్లను ఒక్కొక్కటీ తీసి గాల్లోకి వెదజల్లాడు. ఈ డబ్బులు చాలకపోతే బిక్షం అడిగి ఇస్తానంటూ డబ్బులు విసిరేయడంతో అక్కడ ఉన్న అధికారులు అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో స్పందించిన మంత్రి గిరీష్ మహాజన్ బీడీవో జ్యోతి కవడదేవిని సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు. తాను వెదజల్లిన డబ్బును పేదల నుంచి సేకరించానని, ఆ మొత్తాన్ని కూడా బీడీవో నుంచి వసూలు చేసి ఇప్పించాలని సర్పంచ్ కోరారు.ఇతను అసలైన దేశ పౌరుడు అంటే ఇతన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి అందరూ ఇతని లాగానే లంచం అడిగిన అధికారులతో వ్యవహరిస్తే దేశంలో లంచం అనే మాటే ఉండదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.