రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి

 విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 12 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలకు కారణాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
విధిగా విజిబుల్ పోలీసింగు చేపట్టాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ
ప్రజలకు హెల్మెట్ ధారణ, రహదారి భద్రత, సైబరు మోసాలు పట్ల అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ
గణేష్ నిమర్జనాల్లో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు సెప్టెంబరు 11న జామి పోలీసు స్టేషనుని ఆకస్మికంగా సందర్శించి, స్టేషను ప్రాంగణాన్ని, పోలీసు స్టేషనులోని గదులను, ప్రాపర్టీ రూం, లాక ప్ గదులను పరిశీలించారు. పోలీసు స్టేషను ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి, ఏ వాహనం ఏ కేసులోనిది అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జామి పోలీసు స్టేషనులోని వివిధ రికార్డులు, సిడి ఫైల్స్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తనిఖీ చేసారు. అనంతరం, పోలీసు స్టేషనులోని క్రైమ్ చార్ట్ పరిశీలించి, పోలీసు స్టేషను పరిధిలో రహదారి ప్రమాదాలు ఎక్కడ ఎక్కువగా జరుగు తున్నది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నది ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జామి పోలీసులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ స్పాట్స్ కు ఇరువైపు కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుటకు గల కారణాలను అన్వేషించి, స్పీడు బ్రాకర్లు, స్టాపర్లును ఏర్పాటు చేయాలన్నారు. విధిగా ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ప్రజలకు రహదారి భద్రత, మహిళల భద్రత, కొత్త చట్టాలు, సైబరు మోసాలు, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించే విధంగా చూడాలని, హెల్మెట్ ప్రాముఖ్యతను వాహనదారులకు వివరించి, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాల నియంత్రణకు పగలు, రాత్రి బీటులను వేయాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు సిబ్బంది తరుచూ తమకు కేటాయించిన దత్తత గ్రామాలను సందర్శించి, గ్రామంలో శాంతిభద్రతల పరిస్థితులను తెలుసుకొని, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబరు మోసాలపై నమోదైన కేసుల్లో నిందితుల బ్యాంకు అకౌంట్స్ లో ఫ్రీజ్ అయిన నగదును తిరిగి బాధితులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. గణేష్ నిమర్జనం చేపట్టే సమయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నిమర్జనం చేపట్టే చెరువులు, నదుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను ప్రజలను, యువతకు వివరించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్ఐని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ గారు స్టేషను సందర్శించిన సమయంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే.వి.విజయనాథ్, ఎస్. కోట రూరల్ సిఐ కే. రవికుమార్, ఎస్ఐ వీరబాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు.