తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ఉత్తరాంధ్రాలో కొత్త వైరస్ అలజగి.. నిండిపోతున్న ఆసుపత్రులు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ఉత్తరాంధ్రాలో కొత్త వైరస్ అలజగి.. నిండిపోతున్న ఆసుపత్రులు..

జనం న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు.దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరిది హర్యానా. మరొకరిది కర్ణాటక. మొదట్లో ఒకటి, రెండు కేసులే వచ్చినా.. మెల్లిగా చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందీ మాయదారి రోగం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 90 మందిలో ఈ వైరస్ కేసులు నిర్ధారించారు. అదేవిధంగా ఎనిమిది H1N1 వైరస్‌ కేసులు కూడా నమోదయ్యాయి. సీజనల్‌ వ్యాధులకు సీజన్‌ కాదు..మండు టెండకు స్వాగతం పలికే సమయం..ఇలాంటి టైమ్‌లో ఫ్లూ జ్వరాలు దేశమంతటా పెరిగిపోతున్నాయి. అందులో H3N2 వైరస్‌ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా రెండు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ హెచ్3 ఎన్2 రకం ఎఫెక్ట్‌ ఎక్కువ.. ఈ రోగం సోకితే దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. విశాఖలోని ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలతో పెద్దాసుపత్రితో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులకు రోజూ వందల మంది వస్తున్నారు. దీంతో అలెర్టయిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హెచ్1ఎన్1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2. ఇది ప్రస్తుతం దేశంపై విరుచుకుపడటంతో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు. తెలంగాణ సహా..దేశమంతా ఇదే పరిస్థితి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు..ఈ ఫ్లూ జ్వరాలపై ఇవాళ నీతి అయోగ్‌ సమావేశంలో చర్చించనున్నారు.కేసులు పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు ఒక కారణం అయితే.. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం రెండవది. ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తుందని, ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్‌లో ఉత్పరివర్తనలు చోటు చేసుకుంటాయనేది నిపుణుల అభిప్రాయం.H3N2 వైరస్ సోకితే కనీసం వారం రోజుల పాటు లక్షణాలు కనిపిస్తాయి. ఇక స్మోకింగ్‌, డ్రింకింగ్‌ ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువ. వృద్ధులు, చిన్నారుల్లో మరింత ఎఫెక్ట్ చూపించనుంది. కొన్ని సందర్భాల్లో న్యూమోనియాకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఈ వైరస్‌ సోకిన వారు పారాసిట్‌మాల్‌, బ్రూఫిన్‌ లాంటి ట్యాబ్‌లెట్లను వినియోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీ బయాటిక్స్‌తో పాటు ఓఆర్‌ఎస్‌, పండ్ల రసాలు, ఎక్కువగా నీళ్లు తీసుకోవాలనేది డాక్టర్ల సలహా. ముఖ్యంగా చిన్నారులకు ఈ లక్షణాలు ఉంటే స్కూళ్లకు పంపకపోవడం మంచిదంటున్నారు డాక్టర్లు.